11, జూన్ 2012, సోమవారం

ప్రకృతి తత్త్వం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

జగస్థిత విశ్వంభరుడే శ్రీ మహా విష్ణువై
ముజ్జగములేలు మూల విరాట్టుడై
తన ఊర్ధ్వ భాగ శక్తియందు ఆధ్యాత్మిక శక్తులన్ నిల్పి
తన అధో భాగ శక్తియందు ప్రకృతి శక్తియుక్తులన్ నిల్పి
జగమంతయొక మణిపూస మాలికాహారముగ చేసి
జగమంత తానెయై సర్వవ్యాపి 'నే'నని
గీతయందర్జనునికిన్ దెలిపె

అటుల జనించిన ప్రకృతి శక్తులు త్రివిధములై
సత్త్వరజఃతమోగుణములుగా పరిడవిల్లి
భిన్నత్వమై మానవాళియందావిర్భవించి
ప్రతియొకండును వేరువేరై కన్పట్టుచుండె
జగమంత విస్తరించిన ఈ త్రిగుణాత్మకములే
ఆ శ్రీహరి కల్పితంబగు మాయామేయ స్వరూపమని
జగపతి అర్జునునకున్ దెలిపి అట్టి మాయకున్లోబడక
సదా భగవన్నాముచ్చరించువారలె
పరమపద పీఠంబు చేరుదురనియె

సత్త్వగుణాన్వితుడగు విభీషణుడు
సోదర చేష్టలు వారింప కోప కారణంబై
ఆ శ్రీరాముప్రాపకంబు జేరె
రావణుండు రాజస ప్రతీకకాగ
కుంభకర్ణుండు తామస గుణాకర్షితుడయ్యె
భగవా నునికి తెలియవలెనన్న
మానవాళి మనోబుద్ధి వికాసతత్త్వంబు తెలియవలయు
ఇది పరమగురుడు చెప్పిన మాట తెలుసుకోరా పామరుడా!

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి